త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః ।
కర్మణ్యభిప్రవృత్తోఽపి నైవ కించిత్ కరోతి సః ।। 20 ।।
త్యక్త్వా — త్యజించి; కర్మ-ఫల-ఆసంగం — కర్మ ఫలముల పై ఆసక్తి; నిత్య — ఎల్లప్పుడూ; తృప్తః — తృప్తితో; నిరాశ్రయః — దేనిమీద ఆధారపడే అవసరం లేకుండా; కర్మణి — కర్మలలో; అభిప్రవృత్తః — నిమగ్నమై; అపి — అయినా కూడా; న — కాదు; ఏవ — నిజముగా; కించిత్ — ఏ కొంచము కూడా; కరోతి — చేసినట్టు; సః — అతను.
BG 4.20: ఇటువంటి జనులు, తమ కర్మ ఫలములపై ఆసక్తి/మమకారం త్యజించిన పిదప, ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు-విషయములపై ఆధారపడరు. కర్మలలో నిమగ్నమై ఉన్నా, వారు ఏమి చేయనట్టే.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
బాహ్యంగా కనిపించే దానిబట్టి కర్మలు ఎలాంటివో నిర్ణయించలేము. మనస్సు యొక్క స్థితి, ఆ పని కర్మనా లేదా ఆకర్మనా అని నిర్ణయిస్తుంది. జ్ఞానోదయమైన వారి మనస్సు ఎప్పుడూ భగవత్ ధ్యాస లోనే నిమగ్నమై ఉంటుంది. భక్తితో భగవత్ సంయోగంలో సంపూర్ణ తృప్తితో ఉండి, భగవంతుడినే వారు ఆశ్రయించి ఉంటారు మరియు బాహ్య మైన వాటిపై ఆధారపడరు. ఈ మానసిక స్థితిలో వారి అన్ని పనులు అకర్మగా పరిగణించబడుతాయి.
ఈ విషయాన్ని విశదీకరిస్తూ పురాణాలలో ఒక మధురమైన కథ ఉంది:
బృందావన గోపికలు ఒక సారి ఒక ఉపవాస వ్రతం చేసారు. ఆ ఉపవాసాన్ని ముగించటానికి వారికి ఒక మునికి భోజనం పెట్టే కార్యక్రమం చేయవలసి వచ్చింది. యమునా నదికి అవతలి పక్క నివసిస్తూ ఉండే దుర్వాస మహామునికి ఆరగింపు చేయమని శ్రీ కృష్ణుడు వారికి సలహా ఇచ్చాడు. గోపికలు రుచికరమైన భోజనం తయారు చేసి బయలు దేరారు, కానీ యమునా నది ఆ రోజు చాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏ నావికుడూ కూడా వారిని నది దాటించటానికి ఒప్పుకోలేదు.
గోపికలు శ్రీ కృష్ణుడిని ఏదో ఒక పరిష్కారం కోసం వేడుకున్నారు. ఆయన అన్నాడు, ‘యమునా నదికి చెప్పండి, ఒకవేళ శ్రీ కృష్ణుడు అఖండ బ్రహ్మచారి అయితే మీకు దారి ఇవ్వాలి అని’. గోపికలు నవ్వటం మొదలు పెట్టారు, ఎందుకంటే వారు శ్రీ కృష్ణుడు తమపై ప్రేమవ్యామోహ మోజుతో ఉండేవాడు అనుకున్నారు, కాబట్టి ఆయన అఖండ బ్రహ్మచారి అన్న ప్రశ్నే తలెత్తదు అని. ఎదేమైనా, వారు యమునా నదిని ఆ విధంగా వేడుకున్నప్పుడు, ఆ నది వారికి దారి ఇచ్చింది, మరియు వారు వెళ్ళటానికి ఒక పూల వంతెన కూడా అగుపించింది.
గోపికలు ఆశ్చర్య చకితులయ్యారు. వారు దుర్వాస ముని ఆశ్రమానికి వెళ్లారు. వారు తయారు చేసిన రుచికరమైన భోజనమును స్వీకరించమని ఆయనను ప్రార్థించారు. ఆయన సన్యాసి కాబట్టి ఏదో కొద్దిగా తిన్నాడు, దీనితో గోపికలు నిరాశ చెందారు. దీనితో, వారిని సంతృప్తి పరచదలిచిన దుర్వాసుడు తన యోగ శక్తితో వారు తెచ్చినదంతా భుజించాడు. అంత పదార్థాన్ని ఆయన తినటం చూసి గోపికలు ఆశ్చర్య పోయారు, కానీ తాము వండిన శ్రమకు ఆయన న్యాయం చేసాడని సంతోషపడ్డారు.
గోపికలు ఇప్పుడు దుర్వాస మహామునిని, యమున దాటటానికి సహాయం చేయమన్నారు. ఆయన అన్నాడు, ‘యమునా నదికి చెప్పండి, ఒకవేళ దుర్వాసుడు దూబ్ గడ్డి తప్ప ఇంకా ఏమీ తినకుండా ఉంటే, ఆ నది దారి ఇవ్వాలని’. గోపికలు మళ్లీ నవ్వటం మొదలెట్టారు, ఎందుకంటే వారు ప్రత్యక్షంగా దుర్వాసుడు ఎన్నో భోజనార్హపదార్థములతో ఉన్న భోజనం చేయటం చూసారు. అయినా, వారికి ఆశ్చర్యం గొలిపేలా, వారు యమునా నదిని ఆ విధంగా ప్రార్థించినప్పుడు, యమునా నది మరలా వారికి దారి ఇచ్చింది.
గోపికలు శ్రీ కృష్ణుడిని జరిగిన వృత్తాంతం వెనుక ఉన్న రహస్యం అడిగారు. అప్పుడు శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు - భగవంతుడు, మునులు బాహ్యంగా ప్రాపంచిక కార్యకలాపములలో నిమగ్నమై ఉన్నట్టు అనిపించినా, అంతర్గతంగా వారెప్పుడూ ఇంద్రియాతీత స్థితిలో ఉంటారు. ఈ విధంగా అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా, వారు ఏమీ చేయనట్టే లెక్క. గోపికలతో బాహ్యంగా అన్యోన్యంగా ఉన్నా, శ్రీ కృష్ణుడు అంతర్గతంగా అఖండ బ్రహ్మచారి. అలాగే, గోపికలు సమర్పించిన మధురమైన భోజనం చేసినా, అంతర్గతంగా ఆ మహాముని మనసు దూబ్ గడ్డిని మాత్రమే రుచి చూసింది. ఈ రెండు కూడా, కర్మలో అకర్మని విశదీకరించే ఉదాహరణలు.